
TS News: మేం దాడి చేయలేదు.. పోలీసుల తోపులాట వల్లే జరిగింది: భాజపా కార్పొరేటర్లు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయంలో తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని భాజపా కార్పొరేటర్లు స్పష్టం చేశారు. బల్దియా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. శాంతియుతంగా సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసుల తోపులాట వల్ల పూల కుండీలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేసిన భాజపా కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కార్యాలయంలో నిన్న చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతో పాటు వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా చర్యలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను కోరారు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.