TS News: సీఎం సాబ్‌.. పాలనపై చర్చకు సిద్ధమా?: కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్‌ సవాల్‌

కేంద్రంలో భాజపా,  రాష్ట్రంలో తెరాస పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ సవాల్‌

Updated : 27 Dec 2021 15:53 IST

హైదరాబాద్‌: కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణ బంగారం కాలేదని,  సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన యువతకు ఎలాంటి లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ప్రజల్ని కాకుండా పోలీసుల్ని నమ్ముకొన్నారని మండిపడ్డారు. విపక్ష నేతల ఇళ్లచుట్టూ పోలీసుల్ని మోహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని భాజపా శ్రేణులకు తరుణ్‌ చుగ్‌ పిలుపునిచ్చారు. 

మరోవైపు, నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్షను తరుణ్‌ చుగ్‌ ప్రారంభించారు.  రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన సంజయ్‌.. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాజపా నేతలు ఈటల రాజేందర్‌, విజయశాంతి, స్వామిగౌడ్‌, పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని