TS News: కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు: కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన

Updated : 24 Sep 2022 15:09 IST

దిల్లీ: సీఎం కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ నిన్న, మొన్న నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు, ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

పంజాబ్‌ తర్వాత తెలంగాణ నుంచే..

‘‘భాజపా కార్యకర్తలు, కేంద్ర ప్రభుత్వం భయపడదు. 2014లో, ప్రధాని మోదీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. భాజపా ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోంది. 2014లో తెలంగాణలో 43లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరించారు. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోంది.

ధాన్యం సేకరణకు కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోంది. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రుపాయి కూడా భారం పడదు. పంజాబ్‌ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరణ జరుగుతోంది. పంజాబ్‌ నుంచి 135 లక్షల మెట్రిక్‌ టన్నులు.. తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోంది.

తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌ ఎవరూ తినరు. దేశంలో బాయిల్డ్‌ రైస్‌ ఉపయోగం లేకుండా ఉంది. రైతులు కూడా బాయిల్డ్‌ రైస్‌ పండించరు.. దాన్ని ఉత్పత్తి చేసేది మిల్లర్లే. రా రైస్‌ ఇస్తే ఎంతైనా తీసుకుంటామని చెప్పారు. గతేడాది 44.75 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేంద్రం తీసుకుంది. రాబోయే రోజుల్లో దొడ్డు  బియ్యాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని రైస్‌ మిల్లుల్లో రా రైస్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పారు.

ధాన్యం ఉత్పత్తిని అంచనా వేయలేకపోతోంది..

రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ధాన్యం ఉత్పత్తిని సరిగా అంచనా వేయలేకపోతోంది. 108 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని సెప్టెంబరు 29న లేఖ రాశారు. కంటి చూపుతో అంచనా వేసినట్లు లేఖలో తెలిపారు. సర్వే అంచనా, సర్వే లేకుండా బాధ్యతా రహితంగా లేఖ రాశారు. ధాన్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కేంద్రమే కొనుగోలు చేస్తోంది. ధాన్యం సేకరణకు కేంద్రం రూ.26,640 కోట్లు ఖర్చు చేస్తోంది. 2014లో ఉన్న రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచాం. 41 లక్షల మెట్రిక్‌ టన్నులకే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడేమో 108 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలంటున్నారు.

పెట్రోల్‌ విషయంలో అబద్ధాలు

ఇప్పటికి కూడా రా రైస్‌ను కేంద్రం కొనుగోలు చేస్తోంది. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పెట్రోల్‌ విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌ ధరలు పెరిగితే పెట్రోల్‌ ధరలు పెరుగుతాయి. జీఎస్టీ ఆదాయం పడిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సెస్‌ పెంచాం. ఆ ఆదాయం మెరుగుపడిందనే ధరలు తగ్గించే ప్రయత్నం చేశాం.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాం. కేంద్రానికి అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. 80 కోట్ల మందికి ఏడాది పాటు ఉచితంగా రేషన్‌ ఇస్తున్నాం. దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్‌ టీకాలు ఇస్తున్నాం. కేంద్రం దోచుకుంటుందని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే ధరలు పెంచినట్లు మాట్లాడుతున్నారు. కరోనా లేని సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పెంచింది. ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు సహకరిస్తాయి. దిల్లీలో ధర్నాలు చేస్తామని చెబుతున్నారు. దిల్లీలో ధర్నాలు చేస్తే భయపడే ప్రభుత్వం లేదు. వైద్య కళాశాలల విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని