Chandrababu: కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులేంటి?: చంద్రబాబు

గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు

Updated : 12 Oct 2021 14:53 IST

అమరావతి: గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కోర్టులు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు. 

ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని.. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం హేయనీయమని విమర్శించారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు రూ.80వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని దుయ్యబట్టారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. వారికి ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున తెదేపా పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని