CM Kcr: బొగ్గు గనుల వేలం ఆపండి: ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరారు. కోల్‌ బ్లాక్స్‌

Updated : 08 Dec 2021 22:20 IST

హైదరాబాద్‌: కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరారు. కోల్‌ బ్లాక్స్‌ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి 3రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ జూన్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సింగరేణి బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు చేసిందన్న ముఖ్యమంత్రి.. అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంగ్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్‌ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు కోల్‌  బ్లాక్స్‌ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని