KCR: ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే: కేసీఆర్
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇది అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.
రైతులకు ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉత్తరాది రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామన్నారు. రైతుల సమస్యలపై నిన్నే ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని నిరసన కొనసాగిస్తామని సీఎం తెలిపారు. తమ మహాధర్నాలో నీతి, నిజాయతీ ఉన్నాయని.. అందుకే చిరుజల్లులు కూడా స్వాగతం పలికాయన్నారు.
సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా?
‘‘దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని ఆందోళనలు కొనసాగిస్తాం. కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టాం. దేశాన్ని పాలిస్తున్న నాయకులు వితండవాదాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు ధర్నా ఎలా చేస్తారని భాజపా నేతలు అంటున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా? దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఇంకా చాలా పోరాటాలు చేయాలి. అవసరమైతే దిల్లీ యాత్ర చేయాల్సి ఉంటుంది. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.