Telangana Politics: కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే అభివృద్ధి కనిపించడం లేదు: మల్లు రవి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన రూ.65వేల కోట్ల నిధులు ఖర్చు చేయలేదని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన

Published : 29 Aug 2021 01:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన రూ.65వేల కోట్ల నిధులు ఖర్చు చేయలేదని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు చేపట్టినట్లు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. హైదరాబాద్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలన్నీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు జరగడం లేదో సమాధానం చెప్పాల్సిన మల్లారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి మాటలను మంత్రి కేటీఆర్ సమర్థించడం సిగ్గుచేటన్నారు. దళితుల సాధికారత, అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని చెబుతున్న సీఎం కేసీఆర్.. గతంలో దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.

కేసీఆర్ రక్తం దళితులకు అవసరం లేదు: దాసోజు శ్రవణ్‌

‘‘దళితుల కోసం రక్తం ధారపోస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ రక్తం దళితులకు అవసరం లేదు. మీ కుర్చీ ఇవ్వండి చాలు. ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు కేటాయించండి. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత నాయకుడే సీఎంగా ఉంటారని.. లేకపోతే తల నరుక్కుంటానని చెప్పి మాట తప్పారు. దళితులకు బడ్జెట్‌లో మిగిలిపోయిన సబ్ ప్లాన్ నిధులు రూ.65 వేల కోట్లు విడుదల చేయండి. సీఎం కేసీఆర్‌ను ఇన్నాళ్లు భరిస్తూ వచ్చాం.. ఇకపై సహించేది లేదు. ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు దళితులకు వస్తాయి.
 ఉద్యమకాలంలో 1,200 మంది చనిపోతే.. 500 మందికే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ సభ్యత, సంస్కారంతో కూడిన రాజకీయాలు చేయాలి’’ అని దాసోజు వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని