Pegasus: పెగాసస్‌పై దర్యాప్తునకు కేంద్రాన్ని ఆదేశించండి..!

పెగాసస్‌ హ్యాకింగ్‌ ఆరోపణల ఉదంతంతో పాటు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాయి.

Published : 28 Jul 2021 01:43 IST

రాష్ట్రపతికి లేఖ రాసిన ఏడు ప్రతిపక్ష పార్టీలు

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఆరోపణల ఉదంతంతో పాటు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాయి. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్‌సీపీతో పాటు బీఎస్‌పీ, ఆర్‌ఎల్‌పీ, ఎస్‌ఏడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ, సీపీఎం పార్టీలు సంతకాలు చేసినట్లు ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావడం లేదని శిరోమణి అకాలీదళ్‌ (SAD) నేత హర్‌సిమ్రత్‌ బాదల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 300మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే ఆరోపణలు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. దీంతో వాయిదాల నడుమ అటు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని