
TS Politics: హుజూరాబాద్ను శాయశక్తులా అభివృద్ధి చేశా: ఈటల
జమ్మికుంట: హుజూరాబాద్ను శాయశక్తులా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. ‘‘హుజూరాబాద్లో పెద్దగా పెండింగ్ పనులు లేవు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదు. నాకు భాజపా నేతల నుంచి పూర్తి సహకారం ఉంది. నాది కారు గుర్తు అని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు?రైతు బంధు తెలంగాణ మొత్తం అమలు చేసి.. దళిత బంధును హుజూరాబాద్లోనే ఎందుకు అమలు చేస్తున్నారు? నాకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తాం అని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. దుబ్బాకలో అలాగే చేశారా? హుజూరాబాద్లో డబ్బులు పంచడానికి హైదరాబాద్లో ప్రభుత్వ భూములు అమ్మేశారు. మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచేది నేనే’’ అని ఈటల తెలిపారు.
హరీశ్.. 18 ఏళ్ల అనుబంధం మనది..
హరీశ్.. ఎంత పని చేసినా సీఎం కేసీఆర్ మిమ్మల్ని నమ్మరు. ఏనాటికైనా తెరాసను కైవసం చేసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. చిల్లర ఆరోపణలు, చౌకబారు ప్రచారాలు చేయొద్దు. ధర్మం, న్యాయానికి విరుద్ధంగా పని చేస్తే ప్రజల్లో చులకన అవుతారు. 18 సంవత్సరాల అనుబంధం మనది. అవన్నీ మర్చిపోయి సీఎం దగ్గర మార్కులు కొట్టడానికి ఇవన్నీ చేయొద్దు. మీ మోసపూరిత మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. దుబ్బాకలో ఎంత ప్రచారం చేసినా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినట్లు బుద్ధి చెప్పారు. హుజూరాబాద్లోనూ అదే జరుగుతుంది. హుజూరాబాద్లో అభివృద్ధి జరగలేదని అంటున్నారు. మీరు నిన్న ప్రచారం చేస్తూ తిరిగిన రోడ్లన్నీ నేను వేయించినవే. తెలంగాణ ఏర్పడిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చాను. నాతోపాటు 11 మంది ఓటమికి కేసీఆర్ యత్నించారు. మిమ్మల్ని ఓడించేందుకు విపక్షాలకు కేసీఆర్ డబ్బులిచ్చారు’’ అని ఈటల వెల్లడించారు.