AP News: ముగిసిన కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. గత రెండు రోజులుగా వాయిదా పడిన ఎన్నికను హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారులు..

Updated : 24 Nov 2021 13:45 IST

కొండపల్లి: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. గత రెండు రోజులుగా వాయిదా పడిన ఎన్నికను హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారులు నిర్వహించారు. తెదేపా ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైకాపా సభ్యులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికకు మందు వార్డు సభ్యులతో ఆర్వో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నిక వివరాలను ఎస్‌ఈసీ హైకోర్టుకు అందజేయనున్నారు. ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాల మేరకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన వారి పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు.

తొలిరోజు(సోమవారం) నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు(మంగళవారం)కు వాయిదా పడిన ఛైర్మన్‌ ఎన్నిక నిన్న కూడా వాయిదా వేశారు. తెదేపా ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫీషియో ఓటు చెల్లదంటూ వైకాపా సభ్యులు నిన్న ఎన్నికలో పాల్గొనలేదు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నిక హాలు నుంచి బయటికి వచ్చారు.

అంతకముందు తెదేపా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరపాలని హైకోర్టులో నిన్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ ఎన్నిక నిర్వహించాలని.. ఫలితాన్ని వెల్లడించవద్దని ఆదేశించింది. ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగం ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు