
ప్రతి ఇంటికీ 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ!
మొన్న పంజాబ్.. నేడు గోవా.. కేజ్రీవాల్ హామీల వర్షం!
పనాజీ: 2022లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు హామీలు కురిపిస్తున్నారు. ఇటీవల పంజాబ్, ఉత్తరాఖండ్లో పర్యటించిన ఆయన తాజాగా గోవా సందర్శించారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే గత విద్యుత్ బిల్లులన్నీ మాఫీ చేస్తామన్నారు. తద్వారా గోవాలో 87% మంది ప్రజలకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.
దిల్లీ ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నప్పుడు గోవా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత భాజపాలో చేరి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వారిపై ధ్వజమెత్తారు. ప్రజల పనులు చేసేందుకు చేరుతున్నట్టు ప్రకటించి ఆ పనైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజలు దీన్ని ద్రోహంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు, సిద్ధూ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. విపక్ష నేతలు కూడా తమను ప్రశంసిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ‘నా దూరదృష్టిని, పనితీరును ఆమ్ఆద్మీ పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది’ అంటూ పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ చేసిన ట్వీట్పైనా కేజ్రీవాల్ గోవాలో స్పందించారు. ప్రత్యర్థులు సైతం తమను ప్రశంసించడం ఆనందంగా ఉందన్నారు.