Pawan kalyan: కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు: పవన్‌ కల్యాణ్‌

కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.  వైకాపా  గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు....

Updated : 29 Sep 2021 17:47 IST

మంగళగిరి: కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.  వైకాపా  గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు. ‘ఘోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే కుక్కలు. గ్రామ సింహాలు అంటే పళ్లు రాలగొట్టించుకునే కుక్కలు’ అని పవన్‌ వివరించారు. ‘‘భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా. వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.

ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తాం..

‘‘ వైకాపా నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తాం.  2014లో తెదేపా, భాజపాకు కూడా అభివృద్ధి కోసమే మద్దతిచ్చా. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను. నిజమైన ప్రెసిడెంట్‌ మెడల్‌ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5000 ఇస్తే ప్రెసిడెంట్‌ మెడల్‌ ఇస్తుంది. రూ.5000కే ప్రెసిడెంట్‌ మెడల్‌, మద్యం అమ్ముతున్నారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత వైకాపా ప్రభుత్వం నిజం చేస్తుంది. నన్ను తిడితే ఏడుస్తానని వైకాపా నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాను. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మద్యం మామూళ్లు ఎక్కడికెళ్తున్నాయి..

‘‘నేను సినిమా టికెట్ల గురించి మాత్రమే మాట్లాడా.. నాకేమీ సినిమా థియేటర్లు లేవు. మీ వైకాపా నేతలకే థియేటర్లు ఉన్నాయి. నా మొదటి సినిమాకు మా బావ అరవింద్‌ రూ.5వేలు ఇచ్చారు. జానీ సినిమాకు తీసుకున్న డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేశా. మా కష్టార్జితంపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని మాత్రమే అడిగాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాట్ల కుక్కల్లా అరుస్తున్నారు. వైకాపా వాళ్లు సొంత డబ్బు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? సైనిక సంక్షేమ బోర్డుకు రూపాయైనా ఇచ్చారా? రూ.లక్ష కోట్లు సంపాదించినా ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చరు. ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు. భారతీ సిమెంట్‌ను అందరికీ ఉచితంగా పంచవచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పని వైకాపా వాళ్లకు సిగ్గుండాలి. వైకాపా నేతలు బెదిరిస్తే భయపడటానికి ఇడుపులపాయ ఎస్టేట్‌ కాదు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైకాపా వాళ్లకు చెప్పా. వైకాపా సర్కార్‌ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికెళ్తున్నాయి. వైకాపా వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను. భగత్‌ సింగ్‌, బోస్‌, గాంధీలకు తలవంచుతా. వైకాపా నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా? వైకాపా నాయకులకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా? జీతాలు, పింఛన్లు ఠంచనుగా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ఉంది. వితంతు పింఛన్లు సకాలంలో ఇవ్వలేని దుస్థితి. నేను రూ.కోట్లు పన్ను కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని. ప్రజారాజ్యం పార్టీ వేళ అన్నకు అండగా ఉందామనుకున్నా. నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. 2014లో తెదేపాకు మద్దతిచ్చినా ఏ సాయం పొందలేదు. పార్టీ ఆఫీస్‌ కోసం తెదేపా ప్రభుత్వాన్ని స్థలం కూడా అడగలేదు. నేను ఇచ్చే వాడినే తప్ప తీసుకునే వాడిని కాదు. జనం కోసం నా పౌరుషాన్ని తగ్గించుకుంటాను. 151 సీట్లు గెలిచిన పార్టీ.. అందరినీ చంపేద్దామనుకుంటే ఎలా? అందరినీ భయభ్రాంతులను చేసి పాలించడం సాధ్యమేనా? 2014లో చంద్రబాబు నా ఆఫీసుకు వచ్చారు. చంద్రబాబును రమ్మనటానికి కారణం మాకు గౌరవం కోరుకోవటమే. నా ఆత్మాభిమానంపై దెబ్బకొడితే అంతే గట్టిగా బదులిస్తాం. నేనెప్పుడూ డబ్బు వెంట పడలేదు’’ అని పవన్‌ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది

‘‘కేంద్రంతో పోరాడదామంటే నన్ను గెలిపించ లేదు. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడిని. వైకాపాకు ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా? అయినా నా శక్తి మేర పనిచేస్తా. పాతికేళ్లు జనంలో పనిచేస్తానని 2014లో చెప్పా. నన్ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతా. కులాలకు సంబంధించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కులాలు ఐక్యంగా ఉండకపోతే ప్రజలే నష్టపోతారు. స్నేహానికైనా వైరానికైనా నేను సిద్ధమే. నా ఆర్థిక మూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదు. నన్ను కాపులతోనే కాదు అన్ని కులాలతో తిట్టించండి. ఏ కులం నూరు శాతం ఎవరితోనూ ఉంటుందని అనుకోను. కాపులు నాతో ఉంటే కాకినాడలో ద్వారంపూడి నన్నెలా తిట్టగలిగేవారు? కాపు ఉద్యమంలో వైకాపా వారే చొరబడి అలజడి సృష్టించారు. తుని రైలు ఘటనప్పుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం. కులాల తగాదాలతో రాష్ట్ర అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం తగలబెట్టేస్తోంది. అమరావతిని కొనసాగించమని భాజపాకు చెప్పా. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడా. ప్రత్యేక హోదా విషయంలో నాకు అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారు. వైకాపా దుష్టపాలన అంతమొందించే సమయం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మార బోతున్నాయి. ఓడిపోతానని నేనూ అనుకోలేదు. వైకాపా ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు. ఊహించనివి జరగడమే ఎన్నికలంటే. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైకాపాకు 15 సీట్లు రావచ్చుగా! వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వైకాపా వాళ్ల చిట్టా రాసిపెట్టుకోండి..

‘‘వైకాపా నాయకత్వానికి సవాల్‌ విసురుతున్నా. మీరా? మేమా? పెట్టుకుందాం రా.. అని సవాల్‌ చేస్తున్నా. వైకాపా వాళ్ల చిట్టాలు రాసి పెట్టుకోమని జనసేన కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. జనసేన గురించి మాట్లాడితే తోలుతీస్తామని చెప్పండి. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి చిట్టా కార్యకర్తలు రాసి పెట్టాలి. కాకినాడలో నాడు జనసేనపై చేసిన దాడిని  మరిచిపోయే ప్రసక్తే లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలి. బిహార్‌ నుంచి కిరాయి మూకలను కావాలంటే తెప్పించుకోండి. వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోంది.అధికారం రెండు వర్గాలకే పరిమితమా.. మిగతా వర్గాలకు అధికారం ఇవ్వరా? వైకాపా ప్రభుత్వం కక్షగట్టి కమ్మవారిపై దాడి చేస్తున్నారు. ఆ వర్గం వారిని రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. ఇది అన్యాయం. దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే  స్థాయికి వైకాపా దిగజారింది. రాష్ట్రం నుంచి వైకాపాను పంపించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని