TS News: అడ్డంకులు అధిగమించి ర్యాలీ నిర్వహించిన కమలనాథులు

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా భాజపా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరించినా.. శాంతియుతంగా ర్యాలీ

Updated : 04 Jan 2022 19:35 IST

సికింద్రాబాద్‌: బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా భాజపా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరించినా.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని, ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని జేపీ నడ్డా స్పష్టం చేశారు. కమలనాథులు చెప్పినట్టుగానే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం  జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున సికింద్రాబాద్‌ చేరుకుని, చేతిలో నల్ల జెండాలు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. బండి సంజయ్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ప్యారడైజ్‌ కూడలి నుంచి ఎంజీ రోడ్డు వరకు పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా భాజపా నేతలు నల్లమాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, పార్టీ నేతలు వివేక్‌, విజయశాంతి, ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నేతల లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని