Pegasus: పెగాసస్‌తోనే కర్ణాటక సర్కారు కూలిందా..?

దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘పెగాసస్‌’ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌

Published : 21 Jul 2021 01:11 IST

స్పైవేర్‌ లక్షిత జాబితాలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల నంబర్లు

దిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘పెగాసస్‌’ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహా పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు ‘ది వైర్‌’ వార్తా సంస్థ వెల్లడించగా.. తాజాగా మరిన్ని వివరాలను బయటపెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ హ్యాకింగ్‌ వ్యవహారానికి సంబంధముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

2019 జులైలో కర్ణాటకలో కాంగ్రెస్ ‌- జేడీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా ‘ది వైర్‌’ వెల్లడించిన కథనంలో.. అప్పటి కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శుల ఫోన్‌ నంబర్లు స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. వీరితో పాటు కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్ల పైనా నిఘా పెట్టినట్లు తెలిపింది. దీంతో ఈ హ్యాకింగ్‌ ద్వారానే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఉంటుందనే సందేహాలు వెలువడుతున్నాయి. 

2019లో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 17 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో కుమారస్వామి సర్కారు బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. అప్పట్లో కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాషాయ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను భాజపా కొట్టిపారేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని