Kishan reddy: మార్పు హుజూరాబాద్‌ నుంచే మొదలవ్వాలి: కిషన్‌రెడ్డి

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ

Updated : 24 Sep 2022 17:03 IST

కమలాపూర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ ఏడేళ్లలో రూ.వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా బతికేందుకా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈటల రాజేందర్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హుజూరాబాద్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కరోనాను అరికట్టేందుకు ఈటల రాజేందర్‌ అంకితభావంతో పనిచేశారు. కేసీఆర్‌ ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే ఉంటారు. రూ.1900 కోట్లతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు సిమెంట్‌ రోడ్డు వేసిన ఘనత నరేంద్రమోదీది. రూ.6వేల కోట్లతో రామగుండంలో కిసాన్‌ యూరియాని  కేంద్రం ఉత్పత్తి చేస్తోంది. బీసీల హక్కులను కాపాడేందుకు మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్‌ నుంచే పడాలి. 2023లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. హుజూరాబాద్‌లో భాజపా గెలిస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వాళ్ల నియోజకవర్గాల్లో ఓడిపోతారు. తెరాస ఎమ్మెల్యేలు పోతే మంచి పథకాలు వస్తాయని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ ఒక్కడు కాదు.. మేమంతా ఉన్నాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌ ప్రజలు తెరాసకు వాత పెట్టడం ఖాయం:ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాపూర్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. 2023 ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రిహార్సల్స్‌ మాత్రమేనని, 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఒక వ్యక్తిని ఓడించేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు చుట్టాలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌ ప్రజలు తెరాసకు వాత పెట్టడం ఖాయమన్నారు.కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని