
Rahul Gandhi: పరిస్థితి ఇలా ఉంటే మన్మోహన్ రాజీనామా చేసేవారు: రాహుల్ గాంధీ
దిల్లీ: భారత్-చైనా సరిహద్దు విషయంలో తలెత్తుతున్న వివాదాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలననలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే ఆయన రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ జైపుర్లో కాంగ్రెస్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత భూభాగంపై చైనా ఆక్రమణలు జరగలేదని.. ఒకవేళ అలాంటివే జరిగిఉంటే ఆయన రాజీనామా చేసి ఉండేవారని పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పైనా రాహల్ మండిపట్టారు. దేశంలో విద్వేషాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఈ విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయలేక, వాటిని చూపించుకోలేక వీరంతా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.