Mayawati: వచ్చే ఎన్నికల్లో.. బాహుబలులు, మాఫియాకు నో టికెట్‌..!

వచ్చే ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేతలకు తమ పార్టీ నుంచి టికెట్‌ ఇచ్చేదే లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు.

Published : 11 Sep 2021 02:18 IST

స్పష్టం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాయి. ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు, అభ్యర్థుల జాబితాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేతలకు తమ పార్టీ నుంచి టికెట్‌ ఇచ్చేదే లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీకి తమ పార్టీ తరపున మరోసారి టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మవూ అసెంబ్లీ స్థానం నుంచి ముక్తార్‌ అన్సారీ స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీం రాజ్‌భర్‌ను పోటీలో దింపుతామని మాయావతి ప్రకటించారు. ముక్తార్‌ అన్సారీ సోదరుడు సిగ్బతుల్లా అన్సారీ సమాజ్‌వాదీ పార్టీ (SP) లో చేరిన నేపథ్యంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయంలో పార్టీ ఇంఛార్జీలు మాఫియా నేపథ్యం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం ఏర్పడ్డాక అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఎటువంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు.

మాజీ గ్యాంగ్‌స్టర్‌గా పేరొందిన ముక్తార్‌ అన్సారీ, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీఎస్‌పీ తరపున పోటీ చేసిన ఆయన.. మవూ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనపై ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు సమీప రాష్ట్రాల్లో కలిపి దాదాపు 52 కేసులు ఉన్నట్లు సమాచారం. వాటిలో దాదాపు 15 కేసులు విచారణ దశలో ఉండగా.. ప్రస్తుతం అన్సారీ బందా జైలులో ఉన్నారు. ముక్తార్‌ అన్సారీ మరో సోదరుడు అఫ్జల్‌ అన్సారీ మాత్రం బీఎస్‌పీ తరపున ఘాజీపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి గెలుపొందారు. భాజాపా అభ్యర్థి, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న మనోజ్‌ సిన్హాను క్రితం ఎన్నికల్లో అఫ్జల్‌ అన్సారీ ఓడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని