NEET: ‘నీట్‌’కి వ్యతిరేకంగా పోరాడుదాం రండి.. 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ (NEET)ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరోసారి వ్యతిరేకించారు.

Updated : 05 Oct 2021 05:26 IST

12 రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

చెన్నై: వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ (NEET)ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరోసారి వ్యతిరేకించారు. ఇందుకు మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో పాటు గోవా ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతోనే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

నీట్‌ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. ఇందుకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తాజాగా ఇతర రాష్ట్రాల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఎన్‌డీయేతర రాష్ట్ర సీఎంలను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖలు రాశారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంలో మన రాష్ట్రాల్లోని పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. విద్యారంగంపై రాష్ట్రాల అధికారాలను పునరుద్ధరించుకునేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ఇందుకోసం నీట్‌కు ప్రత్యామ్నాయంగా వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్‌ కమిటీ నివేదికను తాను రాసిన లేఖకు జతచేశారు.

నీట్‌ (NEET) కాకుండా అందరి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రవేశ విధానం, వాటి అమలు సాధ్యాసాధ్యాలు, అనంతరం ఎదురయ్యే న్యాయపరమైన అంశాలను సూచించాలని తమిళనాడు ప్రభుత్వం ఏకే రాజన్‌ కమిటీని కోరింది. కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు వైద్యవిద్య ప్రవేశ పరీక్షల చట్టానికి తమిళనాడు అసెంబ్లీ ఈమధ్యే ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని