Sharad Pawar: కాంగ్రెస్‌ పార్టీ.. జమీందార్లు.. శరద్‌ పవార్‌ కథ

ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి’ వరకు ఉన్న పట్టు ప్రస్తుతం లేదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు అంగీకరించాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు.

Published : 11 Sep 2021 02:21 IST

కాంగ్రెస్‌ దుస్థితిపై NCP అధినేత శరద్‌ పవార్‌ సెటైర్‌

ముంబయి: గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం దేశవ్యాప్తంగా తగ్గుతున్నట్లు రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి’ వరకు ఉన్న పట్టు ప్రస్తుతం లేదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ కూడా వాస్తవాన్ని సరిచూసుకోవాలని శరద్‌ పవార్‌ సూచించారు.

‘వచ్చే 2024 ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని భావిస్తోన్న ప్రతిపక్షాలకు నేతృత్వం వహించడంలో మమతా బెనర్జీ పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు కాంగ్రెస్‌ నేతలు తమకు రాహుల్‌ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో తన సహచరులు కూడా నాయకత్వం విషయంలో వేరే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేరు’ అని ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి గతంలో మాదిరిగా లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. అయితే, అహంకార పూరిత చర్యల వల్లే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్‌ పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఓ ‘జమీందార్‌’ కథను వినిపించారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

‘ఉత్తర్‌ప్రదేశ్‌ జమీందార్లకు భారీ మొత్తంలో భూములు, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు ఉండేవి. పొద్దున్నే లేచి ఆ పచ్చని పొలాలను చూపిస్తూ ఆ భూమంతా తనదేనని జమీందార్‌ చెప్పుకొనేవారు. ల్యాండ్‌ సీలింగ్ చట్టం కారణంగా వేల ఎకరాల నుంచి అవి 15 లేదా 20 ఎకరాలకు తగ్గిపోయాయి. వ్యవసాయ భూముల నుంచి వారికి వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్యాలెస్‌లు మాత్రం మిగిలి ఉన్నాయి. కానీ, వాటిని బాగు చేయించి, నిర్వహించుకునే సామర్థ్యం మాత్రం జమీందార్లకు లేదు’ అని కాంగ్రెస్‌ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ శరద్‌ పవార్‌ ఈవిధంగా సెటైర్‌ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని