Third Front: థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు..!

దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్‌ తప్పనిసరి అని చెబుతున్న పలు ప్రాంతీయ పార్టీలు అందుకు తగ్గట్లుగానే ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated : 08 Sep 2021 07:14 IST

సెప్టెంబర్‌ 25న ఒకే వేదికపైకి కీలక నేతలు

దిల్లీ: దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్‌ తప్పనిసరి అని చెబుతున్న పలు ప్రాంతీయ పార్టీలు అందుకు తగ్గట్లుగానే ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (INLD) అధినేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సెప్టెంబర్‌ 25న జరిగే మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ జయంతిని ఇందుకు వేదికగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడతో పాటు శిరోమణి అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ హాజరయ్యేందుకు ఇప్పటికే అంగీకరించారు.

ఇక ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌధురిలకు ఆహ్వానం పంపినప్పటికీ హాజరయ్యే విషయంపై వారినుంచి స్పష్టత రావాల్సి ఉందని ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌ చౌతాలా తెలిపారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌యేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా సారూప్యత కలిగిన పార్టీలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రజా సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం తృతీయ ఫ్రంట్‌ అవసరమనే ఉద్దేశంతోనే పార్టీలన్నీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఐఎన్‌ఎల్‌డీ నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని