Pawan kalyan : రాజమహేంద్రవరంలో పవన్‌కు ఘనస్వాగతం

ఏపీలోని రెండు జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు శ్రమదానం చేపట్టనున్నారు.

Updated : 13 Nov 2023 16:52 IST

రాజమహేంద్రవరం : ఏపీలోని రెండు జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు శ్రమదానం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట- బాలాజీపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పవన్‌ బాలాజీపేటకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా జనసైనికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు.

వర్షంలోనూ కొనసాగుతున్న పర్యటన..

మరికాసేపట్లో పవన్‌ బాలాజీపేటకు చేరుకోనున్నారు. అయితే సభాస్థలితోపాటు రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షంలోనూ జనసేనాని తన ర్యాలీని కొనసాగిస్తున్నారు.

సభకు ఎలాంటి ఆంక్షలు లేవు : ఏఎస్పీ

మరోవైపు పవన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పవన్‌ అభిమానులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్‌ సభ నిర్వహించనున్న బాలాజీపేటకు ఇరువైపుల 5 కి.మీ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా, బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ లతామాధురి తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ సభకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని