Pawan kalyan: కొత్త ఏజెన్సీకోసం ఉన్న ఉద్యోగులను బలిచేస్తారా?: పవన్‌ 

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న 1700 మంది ఉద్యోగులను వారి బాధ్యతల నుంచి ఒక్కసారిగా దూరం చేయడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..

Updated : 11 Oct 2021 10:36 IST

అమరావతి: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న 1700 మంది ఉద్యోగులను వారి బాధ్యతల నుంచి ఒక్కసారిగా దూరం చేయడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులుగా .. ఇలా అనేక బాధ్యతల్లో పనిచేస్తున్న వారిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీహెచ్‌సీ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు తమ బాధలను, ఆవేదనను జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పవన్‌ కల్యాణ్ ఓప్రకటనలో తెలిపారు.

పేద రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవల్లో భాగంగా తమ విధులు నిర్వహిస్తున్న వారిని అందుకు దూరంపెట్టడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. కరోనా మొదటి దశ, రెండో దశ ఉద్దృతంగా ఉన్న సమయంలో యూపీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు చేశారని... ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకెళ్లారన్నారు. పరీక్షల నుంచి టీకాల వరకు ఎన్నో కీలక విధుల్లో పనిచేశారని.. అందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా.. ఉద్యోగ భద్రత లేకుండా చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో మరో ఏజెన్సీని తీసుకున్నాం కాబట్టీ పాతవారికి పనిలేదు అన్ని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఏజెన్సీ మారితే ఉపాధి పోవాలా? కొత్త ఏజెన్సీ కోసం ఉన్న ఉద్యోగులను బలి చేస్తారా? లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి... ఇప్పుడున్న ఉద్యోగుల సేవల్ని నిలిపివేయడం ఏమిటి? అని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. యూపీహెచ్‌సీల్లో అనుభవం ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌ ..చిరుద్యోగులకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని