
Ap News: సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారు: పవన్ కల్యాణ్
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్ మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందన్నారు. ఈ మేరకు జనసేనాని ప్రకటన విడుదల చేశారు. కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు, మూడు రాజధానులు లేవనే విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే వైకాపా పెద్దలు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారు. 33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి. అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులపై పలు చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారు. మహిళలపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఒకే రాజధాని కావాలని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే మాటపై నిలిస్తే ఒక్క వైకాపా మాత్రమే మూడు రాజధానుల పాట పాడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోంది. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.