TS News: పేరు చివర ‘రెడ్డి’ పెట్టుకునే సంప్రదాయం కొనసాగించండి: పోచారం

రాజకీయం అంటే పవిత్ర అస్త్రం.. మైకు ఉంది కదా అని పలువురు పరుష పదజాలం వాడుతున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆక్షేపించారు.

Published : 26 Sep 2021 01:43 IST

జమ్మికుంటలో రెడ్ల ఆత్మీయ సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

కరీంనగర్‌: రాజకీయం అంటే పవిత్ర అస్త్రం.. మైకు ఉంది కదా అని పలువురు పరుష పదజాలం వాడుతున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆక్షేపించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన రెడ్ల ఆత్మీయ సభకు పోచారం సహా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను సభాపతి హోదాలో ఈ సభకు రాలేదు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిగానే మా బంధువులను కలవడానికి వచ్చాను. నాలుగు ముచ్చట్లు వాళ్లతో మాట్లాడదామని వచ్చాను. ఇటీవల కొందరు పేర్ల చివర రెడ్డి అని పెట్టుకోవడానికి భయపడుతున్నారు. మన సంప్రదాయం నిలబెట్టే విధంగా ఆ పేరు దగ్గర రెడ్డి అని తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. అది మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఊళ్లో పది మంది రెడ్లు ఉంటే వెయ్యి మందికి సాయం చేసే మనస్తత్వం మనది. పేదలను ఆదుకొని ముందుకు నడుస్తున్నాం కాబట్టే ఇవాళ ప్రజలు మనల్ని ఎన్నుకుంటున్నారు.. ఆశీర్వదిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలువుతున్నాయా? అని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఒక్కటి కూడా లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్‌ శ్రమిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రానున్న ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని