Ts News: జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా తెరాస ప్రస్థానం: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏళ్ల ప్రస్థానం జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో...

Updated : 25 Oct 2021 20:33 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏళ్ల ప్రస్థానం జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ఉద్యమ సమయంలో అండగా ఉన్న ఏ ఒక్కరినీ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ స్మరించుకోలేదన్నారు. ఎంతో మంది సమాధుల మీద తెరాస పార్టీ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. చట్టం, రాజకీయ నీతి లేకుండా భాగ్యనగరాన్ని గులాబీమయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్న కేసీఆర్‌ అంటున్నారని, ఏడున్నరేళ్ల పాలనపై చర్చకు రావాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుటుంబమే రాష్ట్రం సాధించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులపై చర్చకు సిద్ధమా? అని మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.  ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రభుత్వానికి నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పలేదా?అని ప్రశ్నించారు. తెరాస నేతలపై ఉద్యమ కేసులు కొట్టివేయించుకున్నారని.. విద్యార్థులు, ఉద్యమకారులపై మాత్రం కేసులు కొట్టివేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని