Revanth Reddy: రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచం ముందు భారత్‌ శక్తిమంతమైన దేశంగా నిలబడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 09 Aug 2021 12:11 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచం ముందు భారత్‌ శక్తిమంతమైన దేశంగా నిలబడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి కాంగ్రెస్‌ స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘క్విట్‌ ఇండియా డే’ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. కేసీఆర్‌, మోదీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నారని ఆక్షేపించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత, గిరిజన వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఆ వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని రేవంత్‌ అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా చలించిపోయి తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ గద్దె దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని రేవంత్‌ చెప్పారు.

కార్యక్రమం అనంతరం రేవంత్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఇంద్రవెల్లి సభకు ర్యాలీగా తరలివెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంద్రవెల్లిలో సభ ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని