
Ts News: కేసీఆర్.. ముందుస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారో..: రేవంత్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో భాజపాను బలోపేతం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందన్నారు. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు.
‘‘2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయి. కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు చివరకు మిత్ర ద్రోహిగా మిగిలిపోతారు. హరీశ్రావును పూర్తిగా ఇంటికి పంపించే ప్రణాళిక కేసీఆర్ సిద్ధం చేశారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తుందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చేప్తారు? అడక్కుండానే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఆశ చూపి ప్రజలను మోసం చేశారు. తెరాస అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదు. కేసీఆర్తో వేదిక పంచుకోవడానికి ఎంపీ రాములు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్ లాంటి వాళ్లు పనికిరారా?’’ అని రేవంత్ అన్నారు.