Chandrababu Naidu: ఏపీలో వైకాపా ప్రేరేపిత పోలీస్‌రాజ్‌: చంద్రబాబు

దెందులూరు తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు తగవని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Updated : 30 Aug 2021 12:21 IST

అమరావతి: తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు తగవని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విశాఖ జిల్లాలో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. ‘‘తెదేపా నాయకులపై తప్పుడు కేసులు సరికాదు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు మంచిది కాదు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రేరేపిత పోలీస్‌ రాజ్‌ కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా?

ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసుల విభాగం వేధిస్తోంది. ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయి. చింతమనేని ప్రభాకర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయం. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై ప్రభాకర్‌ నిరసన వ్యక్తం చేశారు. దెందులూరు తహశీల్దార్‌కు వినతి పత్రమిస్తే తప్పుడు కేసులా?విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే అశాస్త్రీయంగా అరెస్టు చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా?నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా?

తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి. రాష్ట్రంలో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారు. రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత తీరు బ్లాక్‌ మార్క్‌గా ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోండి. తెదేపా నాయకులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని