Devineni Uma Maheswara Rao: దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నేత దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు..

Updated : 28 Jul 2021 12:31 IST

మైలవరం: కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నేత దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

దేవినేని ఉమపై దాడి అమానుషం: చినరాజప్ప 
దేవినేని ఉమపై దాడి అమానుషం అని తెదేపా సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైకాపా గూండా రాజకీయాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఒక్కరిపై 100 మంది దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ప్రోద్బలంతోనే ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. దాడి జరుగుతుందని తెలిసి కూడా వైకాపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. 

అవినీతి రాజ్యమేలుతోంది..: యనమల
వైకాపా పాలనతో అవినీతి రాజ్యమేలుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సహజవనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులా?అని ప్రశ్నించారు. నిందితులను వదిలేసి భాధితులను అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. వసంత కృష్ణప్రసాద్‌ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. దేవినేనిని వదిలిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని