Priyanka Gandhi: యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ప్రియాంకా గాంధీ

ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా తమ పార్టీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు......

Published : 15 Nov 2021 01:37 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పలు పార్టీలతో పొత్తుపెట్టుకోనుంది అని వస్తున్న ఊహాగానాలకు ఆ పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ తెరదించారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా తమ పార్టీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. బులంద్‌షహర్‌లో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ‘ప్రతిజ్ఞ సమ్మేళన్‌-లక్ష్య 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే నామినేట్ చేస్తాం. కాంగ్రెస్‌ గెలవాలనుకుంటే ఒంటరిగానే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె నేతృత్వంలోనే కాంగ్రెస్‌.. యూపీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ గతంతోనే వెల్లడించారు. ఇదిలా ఉండగా.. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. భాజపా 312 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్‌ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు