
AP News: ముగిసిన సీపీఎం రాష్ట్ర మహాసభలు.. కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నిక
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా వి.శ్రీనివాసరావుతో పాటు 50 మంది సభ్యులతో కొత్త కమిటీని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న పి.మధుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించారు. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త నాయకత్వానికి సీపీఎం కేంద్ర కమిటీ విప్లవాభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
అమరావతికి మద్దతుగా తీర్మానం
మూడు రోజుల పాటు జరిగిన మహాసభల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి మద్దతు తెలపడంతో పాటు పలు రంగాలపై తీర్మానాలు చేశారు. రాజధానిగా అమరావతి ఉండాలంటూ సీపీఎం చేసిన తీర్మానాన్ని అమరావతి రైతులు స్వాగతించారు. మహాసభల వేదిక వద్దకు వచ్చిన రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ప్రస్తుత కార్యదర్శి పి.మధుతో మాట్లాడారు. అమరావతి రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సీపీఎం నేతలు మరోసారి స్పష్టంచేశారు.