ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమే మృత్యుఘోష

రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర పోతుండటం వల్లే ఆక్సిజన్ అందక  ప్రజలు చనిపోయే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 02 May 2021 01:31 IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శ

అమరావతి: రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర పోతుండటం వల్లే ఆక్సిజన్ అందక  ప్రజలు చనిపోయే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వరుస ఘటనలపై ఆత్మవిమర్శ చేసుకోకపోగా ప్రచార ఆర్బాటంలో జగన్మోహన్ రెడ్డి మునిగితేలుతున్నారని మండిపడ్డారు. రోగులకు ఆక్సిజన్ అందించలేని సీఎం గా చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ప్రాణవాయువు అందట్లేదు కానీ వైకాపా నాయకుల అవినీతికి మాత్రం ఆక్సిజన్ అందుతోందని విమర్శించారు. విజయనగరం, కర్నూలు ఘటనలపై  శ్రద్ధ పెట్టి ఉంటే  అనంతపురంలో ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి తీరు అమానుషమన్న చంద్రబాబు.., ఈ మృత్యుఘోష ప్రభుత్వ  అసమర్థతకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించలేకపోనీ చేతకానితనం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రలో మెరుగైన వసతులు లేకే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మొద్దు నిద్ర వీడి, ప్రచార ఆర్భాటాలు మాని కరోనా కట్టడికి తక్షణం చర్యలు చేపట్టి ఆక్సిజన్ అందేలా చూడాలని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని