Congress Presidential Elections: ‘ఖర్గే’నే ఎందుకు..? అధిష్ఠానానికి అంత విధేయుడా..?

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడుగుపెట్టారు. అసలు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన్ని ఎందుకు బరిలోకి దించింది? అధ్యక్షుడిగా కొనసాగడానికి అయనకున్న బలమేంటి?

Updated : 30 Sep 2022 22:58 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత  శశిథరూర్‌తో  పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీపడతారని అందరూ భావించారు. కానీ, ఇవాళ ఉదయం అనూహ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు మద్దతు తెలుపుతూ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దృష్టంతా ఖర్గేపై పడింది. అసలు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్టుండి ఖర్గే పేరును ఎందుకు తెరమీదకు తీసుకొచ్చింది?పార్టీని ముందుకు తీసుకెళ్లగల శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయా? అసలు ఖర్గే రాజకీయ నేపథ్యమేంటి?

ఎవరి ఎదుగుదలైనా వారి పని తీరుపైనే ఆధారపడి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. రాజకీయాల్లో ఇది కాదనలేని సత్యం. మల్లిఖార్జున ఖర్గేకు ఇది చక్కగా సరిపోతుంది. గతంలో మూడు సార్లు సీఎం స్థానానికి చేరువగా వెళ్లి విఫలమైన వ్యక్తి.. అన్నీ సానుకూలంగా జరిగితే పార్టీకే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. 1999, 2004, 2013 ఎన్నికల్లో ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని తృటిలో కోల్పోయారు. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అధిష్ఠానం ఆయన్ను పక్కకి పెట్టింది. అలాగని ఆయన ఏనాడూ సహనం కోల్పోలేదు. ఓపికతో పార్టీని నమ్ముకొని పని చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి కీలక వ్యక్తిగా మారారు.

గాంధీలకు విశ్వాసపాత్రుడు

దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పని చేస్తున్న ఖర్గేకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గాంధీ కుటుంబమే ఖర్గేను బరిలోకి దించుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణాది నుంచి ఆరో నేత

ఒక వేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే స్వాతంత్ర్యం సాధించిన తర్వాత దక్షిణభారతం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆరోనేతగా మల్లిఖార్జున ఖర్గే రికార్డు సృష్టిస్తారు. ఇప్పటి వరకు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్‌, యస్‌.నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.  1969లో కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే.. 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా 8 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1976లో తొలిసారిగా దేవరాజ్‌ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన్ని మంత్రిగా నియమించేవారు. 1996-99, 2008-09 మధ్య కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. 2005-08 మధ్య కర్ణాటక ప్రదేశ్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వశాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ అనుభవంతో పార్టీని ఖర్గే ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

 2014లో కీలక మలుపు

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. లోక్‌సభలో పార్టీ బలం కేవలం 44 మంది మాత్రమే. ఆ ఎన్నికల్లో కలబురిగి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఖర్గే వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ను నియమించింది. దీంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న ఖర్గే.. తన వాక్చాతుర్యంతో అధికార భాజపాను కట్టడి చేసేందుకు యత్నించేవారు. ‘‘ మేము 44 మంది మాత్రమే అయినా.. మహాభారతంలో 100 మంది కౌరవులు పాండవులను నిలువరించలేకపోయారు’’ అంటూ భాజపా ఎంపీలకు చురకలంటించేవారు. భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారు. ఐదేళ్ల పాటు లోక్‌సభలో ప్రతిపక్షనేతగా పలు ప్రజాసమస్యలను సభ ఎదుట ఉంచారు.

2019లో తొలి ఓటమి

ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఖర్గేను 2019లో పరాజయం పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. దీంతో ఆయన  పనితీరును, సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఫిబ్రవరి 2021లో పార్టీ తరఫున ఆయన్ను రాజ్యసభకు పంపించింది. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే వ్యవహరిస్తున్నారు.

అదనపు బలాలు

ఖర్గే బౌద్ధమత నియమాలను పాటిస్తారు. సౌమ్యుడు, మృదు స్వభావి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హుందాగా వ్యవహరిస్తారు. వివాద రహిత నాయకుడిగా పేరుంది. కలబురిగి జిల్లాలోని వార్వట్టిలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన బీఏ చేశారు. భారత రాజ్యాంగంపై పట్టుంది.  కాంగ్రెస్‌కు దాదాపు 50 ఏళ్లకంటే ముందు ఏర్పడిన పరిస్థితులు తాజాగా మళ్లీ పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు గాంధీకుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తి అవసరమయ్యారు. దీంతో అన్ని విధాలా సరిపోయిన మల్లికార్జున ఖర్గేను అధిష్ఠానం ఎంపిక చేసి బరిలోకి దించుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే,   ఝార్ఖండ్‌ మాజీ మంత్రి  కేఎన్‌ త్రిపాఠి బరిలో నిలిచారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

 -ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని