కాలం సీఎంని చేస్తే.. దురదృష్టం దించేసింది..!

కాలం కలిసొచ్చింది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయనకు అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కొంత దురదృష్టం.. మరికొంత స్వయంకృతాపరాధం.. వెరసి నాలుగు నెలలు తిరగకుండానే

Updated : 03 Jul 2021 12:14 IST

సీఎంగా తీరథ్‌ సింగ్‌.. 115 రోజుల కష్టాలు

ఇంటర్నెట్‌డెస్క్: కాలం కలిసొచ్చింది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయనకు అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కరోనా రూపంలో వచ్చిన కొంత దురదృష్టం.. మరికొంత స్వయంకృతాపరాధం.. వెరసి నాలుగు నెలలు తిరగకుండానే ఆయన కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది..! 115 రోజుల అతితక్కువ పదవీకాలం.. సీఎంగా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రయాణం.. అంతా కష్టాలమయమే!! 

అధికారిక నివాసంలో ఉండలేదు.. అసెంబ్లీకి వెళ్లలేదు

పార్టీలో తీవ్ర అసమ్మతి కారణంగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఈ ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే నెల 10న నూతన ముఖ్యమంత్రిగా తీరథ్‌సింగ్‌ ప్రమాణం చేశారు. అదే సమయంలో కరోనా రెండో దశ ఉద్ధృతి మొదలవడంతో డెహ్రాడూన్‌లోని ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పనిచేస్తుందని తీరథ్‌ ప్రకటించారు. దీంతో ఆయన తన వ్యక్తిగత నివాసంలోనే ఉంటూ సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని రోజుల్లో సీఎం అధికారిక నివాసానికి మారాలని అనుకున్నారు. అయితే ఈలోగానే అనూహ్యంగా రాజకీయాలు మలుపు తిరగడం.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగకపోవడం గమనార్హం. 

ఉపఎన్నికల ఆశలపై ‘కరోనా’ నీళ్లు..

తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. నిజానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఆయన ఉపఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండగా.. కరోనా ఆయన ఆశలపై దెబ్బకొట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 12 రోజుల తర్వాత మే 22న తీరథ్‌ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన మరుసటి రోజే అంటే మే 23న ఉత్తరాఖండ్‌లో ఖాళీగా ఉన్న సాల్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నామినేషన్‌ వేయడానికి మే 30 వరకు గడువు కల్పించింది. అయితే ఐసోలేషన్‌ కారణంగా తీరథ్‌ నామినేషన్‌ వేయలేకపోయారు. దీంతో భాజపా మరో అభ్యర్థిని నిలబెట్టింది. ఏప్రిల్‌ 17న జరిగిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. అయితే ఏప్రిల్‌ 4నే తీరథ్‌కు నెగెటివ్‌ వచ్చింది. కరోనా వల్లే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదని తీరథ్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.

ఇక ఏప్రిల్‌, జూన్‌ నెలల్లో గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో ఒక దాన్నుంచి తీరథ్‌ ఉప ఎన్నికల బరిలో దిగుతారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ఆయన ఆశలపై ఈసారి ఈసీ నీళ్లు చల్లింది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, కొవిడ్‌ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఉప ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. దీంతో సీఎం పదవిలో కొనసాగేందుకు ఆయనకు అవకాశాలు మరింత సన్నగిల్లాయి. 

నోరు జారే.. ‘కుర్చీ’ పాయే..

నిజానికి అప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు తీరథ్‌కు ఒక అవకాశం ఉంది. తీరథ్‌తో రాజీనామా చేయించి.. తిరిగి ఒకరోజు తర్వాత మళ్లీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం భాజపాకు ఉంది. ఇలా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే సీఎం అయ్యాక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా అధిష్ఠానానికి తీరథ్‌ తలనొప్పులు తెచ్చిపెట్టారు. మహిళల రిప్‌డ్‌ జీన్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ప్రధాని మోదీని రాముడు, కృష్ణుడి అవతారంగా పేర్కొనడం, ఉచిత రేషన్‌ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పడం వంటివి వివాదాస్పదమయ్యాయి. అంతేగాక, పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలనూ పరిష్కరించలేకపోయారు. ఆయన హయాంలో కుంభమేళా నిర్వహణ తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎంను మార్చేందుకే అధిష్ఠానం మొగ్గుచూపింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని