అవినీతి వల్లే అలా జరిగింది: రాహుల్‌

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల ఆయన కేంద్రానిక......

Published : 29 Mar 2021 01:22 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల ఆయన కేంద్రానికి తలవంచుతున్నారని, అందుకే అమిత్‌షా ముందు సాగిలా పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎంను ప్రధాని మోదీ నియంత్రిస్తున్నారని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నేత (పేరు చెప్పలేదు) సైతం అవినీతికి పాల్పడి స్వేచ్ఛను కోల్పోయారని, పళనిస్వామి విషయంలోనూ ఇప్పుడు అదే జరిగిందని రాహుల్‌ అన్నారు. తమిళనాడు సీఎం అయ్యి ఉండి అమిత్‌షా ముందు సాగిలపడడం బాధాకరమని, తమిళనాడుకు చెందిన వారెవరూ అలా చేయరని చెప్పారు. పళనికి సైతం ఇష్టంలేనప్పటికీ అవినీతి కారణంగా అలా చేయాల్సి వస్తోందని చెప్పారు. తమిళ ప్రజల నుంచి పెద్దఎత్తున దోచుకోవడం వల్లే ఈ గతి పట్టిందని ఆరోపించారు.

తమిళనాట ఎన్నికలు ఒకప్పుడు అన్నాడీఎంకే Vs డీఎంకే మధ్య జరిగేవని, ఇప్పుడు అన్నాడీఎంకే+ ఆరెస్సెస్‌+ భాజపా Vs తమిళ ప్రజల మధ్య జరుగుతున్నాయని రాహుల్‌ అన్నారు. ఈ సారి అన్నాడీఎంకే-భాజపా కూటమికి ఓటమి తప్పదని, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సీఎం కాబోతున్నారని చెప్పారు. స్టాలిన్‌ సీఎం అయినంత మాత్రాన తమిళనాడుపై జరుగుతున్న దాడి ఆగిపోదని, దిల్లీలో కూడా కాషాయ పార్టీకి అధికారం పోతేనే అది సాధ్యమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని