Revanth Reddy: మానవత్వం లేకుండా వెంకట్‌పై పోలీసులు దాడి చేశారు: రేవంత్‌రెడ్డి

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Published : 30 Jun 2022 02:10 IST

హైదరాబాద్‌: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో కాలుషితాహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌ఎస్‌యూఐ నేతలు విద్యార్థులను పరామర్శించేందుకు సిద్దిపేటలకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం తెరాస పాలకుల పాశవికత్వం అని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారన్నారు. మానవత్వం లేకుండా వెంకట్ పైన పోలీసుల దాడి చేశారన్నారు. పాలకులు ఇలాగే పాశవికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామన్నారు. తెరాస పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనలో వెంకట్‌ గాయపడడంతో కాంగ్రెస్‌ నాయకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రేవంత్‌రెడ్డి సిద్దిపేట పోలీస్ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌పై పోలీసుల అరాచకం నియంతృత్వ పోకడకు నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి విమర్శించారు. పోలీసుల దాడిలో సృహ తప్పిపోయిన వెంకట్‌కు ఎలాంటి సమస్య ఎదురైనా తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, నియంత పోకడలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని మల్లురవి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని