Revanth Reddy: రాజీపడటం నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు: రేవంత్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఛార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా తన కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుందని అన్నారు.

Updated : 22 Apr 2023 19:50 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ తన రక్తంలోనే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటూ భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ‘ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. భారాస, భాజపాలు భారీగా డబ్బులతో బరిలోకి దిగితే.. కాంగ్రెస్‌ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపిందని గుర్తు చేశారు.  ‘‘ మునుగోడు ఉపఎన్నిక కోసం భారాస, భాజపా భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ.25 కోట్లు తీసుకున్నట్లు విమర్శించారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్‌ సర్వం దారబోసినా రేవంత్‌ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌కి వ్యతిరేకంగా కొట్లాడటం అంటే ఇదేనా?

కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతిని బయటపెడితే తనను చర్లపల్లి జైల్లో బంధించారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘ కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో నిర్భందించారు. జైల్లో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. నోటీసులు ఇవ్వగానే లొంగిపోయినోడు కాదు ఈ రేవంత్‌రెడ్డి.  రాజేంద్రా.. నువ్వు చేరిన పార్టీలో గుర్తింపు కోసం దిగజారుడు ఆరోపణలు చేస్తావా? ఈటల ఆరోపణలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం. కేసీఆర్‌ దగ్గర రూ.25 కోట్లు తీసుకుంటే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం ఉండేదా? ఇన్నాళ్లూ మీపై సానుభూతి ఉండేది. కేసీఆర్‌కి వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా?9 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడిపా.. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి.. కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం. అందుకోసం సర్వం పోయినా ఫర్వాలేదు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఈటలకు కన్నీళ్ల విలువ తెలీదు

కేసీఆర్‌ దండుపాళ్యం ముఠాలు నా స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కొట్లాడుతూనే ఉంటానని రేవంత్‌ తెలిపారు. ‘‘ కేసీఆర్‌ ముసుగు వేసుకొని ఈటల రాజకీయాలు చేస్తున్నారు. ఈటల ఆరోపణ చౌకబారుగా ఉండొచ్చు.. కానీ, అది నా మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. నేను అమ్ముడుపోయి ఉంటే.. ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదు. ఈటలకు కన్నీళ్ల విలువ తెలియదు... మానవత్వం లేదు. ఎవరు గద్దెనెక్కుతారో.. ఎవరు గద్దె దిగుతారో కాలం నిర్ణయిస్తుంది’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశానని, దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను ఉపసంహరించుకోవాలని అన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈటల దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను విసిరిన సవాల్‌ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశానన్న రేవంత్‌.. ఈటల తన ఆరోపణలను నిరూపించుకోవాలని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని