Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ఏర్పడక ముందు 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. 

Updated : 09 Jun 2023 15:44 IST

హైదరాబాద్‌: పార్టీ, ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. నాయకుడిగా మారేందుకు యూత్‌ కాంగ్రెస్‌ (Youth Congress) ఓ వేదిక అని చెప్పారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రేనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. దాదాపు 1200 మంది విద్యార్థి, యువత ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. భాజపా దృష్టిలో డబుల్‌ ఇంజిన్‌ అంటే అదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇంజిన్‌ పని అని విమర్శించారు. ‘‘ వన్ నేషన్ వన్ పార్టీ అనేది భాజపా రహస్య అజెండా. భాజపా కుట్రలను ఛేదించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలి. సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దాం. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం మీరంతా కష్టపడాలి.  తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా ఇవ్వాలి.’’ అని యువనాయకులను ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి అన్నారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్‌, హరీశ్‌ చర్చకు సిద్ధమా?’ అని రేవంత్ అన్నారు.‘‘ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజలవద్దకు వెళ్తాము. అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయి. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.’’ అని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీల పాత్రపై సమావేశంలో చర్చించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలి. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్‌ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశాం. క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసిన వారు.. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులవుతారని చెప్పాం. మోదీ, కేసీఆర్‌లను గద్దె దించాలంటే యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీలకంగా పని చేయాలి.’’ అని రేవంత్ అన్నారు.

గడీల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రేవంత్ విమర్శించారు. ‘‘ కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను కచ్చితంగా రద్దు చేస్తాం. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి భూముల్లో అవకతవకలు జరిగాయి. వేల ఎకరాల భూమిని కేసీఆర్‌.. బినామీలకు కట్టబెట్టారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిపోయింది. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని