కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి

పశ్చిమ్‌బంగాల్‌ పర్యటనలో ఉన్న తన కాన్వాయ్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేశారని కేంద్ర మంత్రి  మురళీధరన్‌

Updated : 06 May 2021 18:14 IST

పశ్చిమ్‌ మిడ్నాపూర్: పశ్చిమ్‌బంగాల్‌ పర్యటనలో ఉన్న తన కాన్వాయ్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేశారని కేంద్ర మంత్రి  మురళీధరన్‌ ఆరోపించారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. కారు అద్దాలు బద్దలు కొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిపైనా భౌతిక దాడికి దిగారని ఆయన అన్నారు. దీంతో తన పర్యటనను  రద్దు చేసుకొని వెనక్కి వచ్చినట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు మంత్రి కాన్వాయ్‌కు ఎదురుగా నిలబడి అడ్డుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాకుండా మరికొందరు వ్యక్తులు కర్రలు, ఇనుప రాడ్డులు పట్టుకొని మంత్రి కాన్వాయ్‌ను హెచ్చరిస్తున్నట్లు అందులో నమోదైంది.

ఆదివారం ఎన్నికల లెక్కింపు తర్వాత పశ్చిమ్‌బంగాల్‌లో హిస్మాత్మక ఘటనలు ఎక్కువవుతున్నాయి. లెక్కింపు అనంతరం జరిగిన అల్లర్లలో దాదాపు 14 మందికిపైగా భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు  భాజపాయే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తోందని ప్రజలంతా శాంతి స్థాపనకు కృషి చేయాలని  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. 

బంగాల్‌ ముఖ్యమంత్రిగా బుధవారం మూడోసారి మమతా బెనర్జీ  ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఎలక్షన్‌కమిషన్‌ బదిలీ చేసిన పలువురు పోలీసు అధికారులను ఆమె యథాస్థానానికి బదిలీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా ఘటనలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. నిజనిర్ధారణ కోసం హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో  నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు