Telangana News: అర్వింద్‌.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారు?: ఎమ్మెల్సీ కవిత

హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు చేసిందేమీ లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

Updated : 04 May 2022 14:57 IST

నిజామాబాద్‌: హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు చేసిందేమీ లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత కోరారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథేచ్ఛగా పెంచారన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. అర్వింద్‌కు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. బుధవారం కవిత నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

‘‘పసుపుకు మద్దతు ధర ఇస్తామని ఎంపీ చెప్పారు. ఆ విషయం ఏమైంది? పార్లమెంట్‌లో దీనిపై ఎప్పుడు మాట్లాడారు? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్‌ పార్లమెంట్‌లో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడలేదు. మద్దతు ధర ఇవ్వమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి దిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ అధర్మపురి అర్వింద్. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు. అది ఏమైంది? రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్నారు. ఆ విషయంలో పురోగతి ఏది? వీటిపై నిజామాబాద్‌ ప్రజలకు జవాబు చెప్పాలి.

ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమో అని మూడేళ్లు విడిచిపెట్టాం. ఇక విడిచిపెట్టేది లేదు. మీరు దిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. మీ దిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకోని వస్తారో.. ఏం చేస్తారో చేయండి. బాండు పేపర్‌లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం. పసుపుబోర్డు కాకుండా రూ.కోటీ 92లక్షలతో స్పైస్‌ బోర్డు తెచ్చి.. ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారు. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఉపయోగం కూడా ఏమీ లేదు’’ అని కవిత ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని