Janasena: జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. పవన్‌ సమక్షంలో చేరిక

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు.

Published : 12 Mar 2023 15:06 IST

అమరావతి: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకొన్నారు. వారితో పాటు భీమిలి వైకాపా నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్‌ తదితరులు పార్టీలో చేరారు. వాళ్లందరినీ పవన్‌ సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. 

టీవీ రామారావు 2009లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019ల్లో తెదేపా టికెట్‌ రాకపోవడంతో గత ఎన్నికల్లో వైకాపాలో చేరారు. పార్టీకి అనుగుణంగా నడుచుకున్నా.. తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల వైకాపా ఆయన రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనిత (ప్రస్తుత హోం మంత్రి)ని గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం జగన్‌ అప్పట్లో చెప్పారని, తర్వాత కనీసం ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదని రామారావు చెప్పారు. కొందరికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పదవి అయినా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని.. అందుకే వైకాపాను వీడి జనసేనలో చేరినట్లు తెలిపారు.

ఈదర హరిబాబు 1994లో తెదేపా తరఫున ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని