Telangana News: సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణకు మంచిది కాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే అక్కసుతో తమ అధికారం పోతుందనే భయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 

Updated : 07 Aug 2022 17:48 IST

దిల్లీ: రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే అక్కసుతో తమ అధికారం పోతుందనే భయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభద్రతా భావంతోనే వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పాలనపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్న కేంద్ర మంత్రి .. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

నీతి ఆయోగ్‌పై నిన్న సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నీతిఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లకపోవటం సరైన నిర్ణయం కాదు. కేసీఆర్ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు, సమాఖ్య స్ఫూూర్తికి మంచిది కాదు. దేశానికి, రాష్ట్రానికి అవసరమైన అంశాలపై చర్చించేందుకు నీతిఆయోగ్‌ అత్యున్నత వేదిక. రాజకీయ దురుద్ధేశాలతో రాజ్యాంగ సంస్థలను తప్పుపట్టకూడదు. కేసీఆర్‌కు ప్రధానిని కలవటం ఇష్టం లేకపోతే వెళ్లకుండా ఉండొచ్చు. కానీ, నీతి ఆయోగ్‌ను తప్పుపట్టడం సరికాదు. కడుపునొప్పి వచ్చిందని తల నరుక్కున్నట్లుగా కేసీఆర్‌ విధానం ఉంది. తెలంగాణలో భాజపా బలపడిన తర్వాత తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందేమోనని ఆవేదన, అభద్రత భావంతో.. ప్రధాని మోదీ, భాజపాపైనా విష ప్రచారం చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ఆగస్టు 15 దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలని పునరుద్ఘాటించారు. కార్యాలయాలు కాకుండా 20 కోట్లకు పైగా ఉన్న ఇళ్లపై మువ్వన్నెల జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో ఇళ్లపై జాతీయజెండా ఎగరవేయవచ్చన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని