భాజపా ఇతర పార్టీల్లా కాదు: జేపీ నడ్డా

ఇతర పార్టీల్లో ఉన్నట్లు భాజపాలో వారసత్వ రాజకీయాలుండవని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శుక్రవారం లక్నోలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Updated : 21 Dec 2022 15:43 IST

లఖ్‌నవూ: ఇతర పార్టీల్లో ఉన్నట్లు భాజపాలో వారసత్వ రాజకీయాలు ఉండవని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శుక్రవారం  యూపీలోని లఖ్‌నవూలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భాజపా ఒక విజన్‌తో ముందుకెళ్తున్న రాజకీయ పార్టీ అన్నారు. ఇందులో సామాన్య కార్యకర్త కూడా ప్రధాని కావొచ్చన్నారు. ‘‘భాజపాలో నేత (నాయకుడు), నియత్‌ (ఉద్దేశం), నీతి (విధానం), కార్యకర్త, కార్యక్రమం ఉన్నాయి. ఒక పార్టీకి ఇవి ఉంటే చాలు.. విజయవంతంగా ముందుకు సాగుతుంది. వారసత్వ రాజకీయాల వల్ల ఏ విధమైన ఉపయోగమూ ఉండదు’’ అని నడ్డా పేర్కొన్నారు. భారత్‌ కన్నా ఎంతో ముందున్న దేశాలు కరోనా సమయంలో అల్లకల్లోలమైపోయాయి అని అన్నారు. నాయకత్వ లోపం వల్లే అభివృద్ధి చెందిన దేశాలు కరోనాకు కుదేలైపోయాయన్నారు. భారత్‌లో కరోనా కట్టడి చాలా గొప్పగా జరిగిందన్న ఆయన.. రోజుకు లక్షకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పీపీఈ కిట్లను దిగుమతి చేసుకొనే పరిస్థితి నుంచి రోజుకు 5లక్షల పీపీఈ కిట్లను ఉత్పత్తి చేసే స్థితికి భారత్‌ ఎదిగిందన్నారు. స్వచ్ఛతా అభియాన్‌, ఉజ్వల యోజన వంటి పథకాలతో భారత్‌ ఎంతో ముందుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. భాజపా దేశ రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పిందన్నారు. వారసత్వం, కులం, మతం, భాషలతో చేసే రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం, దేశ ఐక్యత, సమగ్రత దెబ్బతింటున్నాయన్నారు.

ఇవీ చదవండి..

ఇంతకన్నా మంచి ప్రతిపాదన లేదు: కేంద్రం

కొవిడ్‌ దెబ్బ.. ప్రధాని పదవికి రాజీనామా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని