
సీఎం నియోజకవర్గంలో ఇంత దారుణమా: ఉత్తమ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళితుడు బ్లాగరి నర్సింహులు ఆత్మహత్య బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా? అని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. దళితులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం అంతమయ్యే వరకు దళితులకు న్యాయం జరగదన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ పిలుపునిచ్చారు. నర్సింహులుకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. దీంతో ఆవేదన చెందిన నర్సింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇటీవల భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రాజబాబును హత్య చేశారన్నారు. ఇంత దారుణం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రజలంతా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.