ఏపీపై కేంద్రానికి సవతి తల్లిప్రేమ: వైకాపా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైకాపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated : 01 Feb 2021 14:47 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైకాపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌పై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘ కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశాజనకంగా ఉంది. ఏపీకి శారాఘాతంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపారు. గతంలో వచ్చిన బడ్జెట్‌ల కంటే చాలా చెత్తగా ఉంది. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ విభజన  జరిగినప్పటి నుంచి విశాఖ, విజయవాడకు మెట్రో రైలు అడుగుతూనే ఉన్నాం... కానీ బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏమీ కేటాయించలేదు. గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాగే చేసింది. ఒక వైరాలజీ సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. ధాన్యం సేకరణలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి. రాష్ట్రంలో 26 జిల్లాలు చేయబోతున్నాం.. వాటికి కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి.

 కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35వేల కోట్లు కేటాయించారు. ఇదొక్కటే బడ్జెట్‌లో మంచి అంశం.  అభివృద్ధి దిశ బడ్జెట్‌ కావాలి కానీ.. సర్వైవల్‌ బడ్జెట్‌ కాదు. విశాఖకు ఒక షిప్పింగ్‌ హార్బర్‌ హబ్‌ ఇచ్చారు. కానీ, రాష్ట్రం 8 హార్బర్‌లకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయంలో ఏపీలో ఏడాదికి రైతుకు రూ.13,500 ఇస్తున్నాం. కేంద్రం రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తోంది.. దాన్ని రూ.10వేలు చేయాలి. ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి 1300  వ్యాధులు ఉంటే.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2వేలకు పైగా వ్యాధులు వస్తున్నాయి. సామాజిక సంక్షేమ పథకాల్లో కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి పురోగతి లేదు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది.. దాని నిర్మూలనకు బడ్జెట్‌లో చర్యలు లేవు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. నరేగా 100 రోజుల నుంచి 150 రోజులకి పెంచాలని కోరినా ..దాని ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 

వైకాపా లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ...బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌ చాలా నిరుత్సాహ పరిచే విధంగా ఉందన్నారు. నరేగా నిధులు, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులు సరిగా లేకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొస్తామన్నారు.  రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం నిధులు ఇవ్వాలని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఇవీ చదవండి...

ఇవీ చదవండి...

ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని