Munugode bypoll: కేసీఆర్‌ బీబీసీ తీసుకుని మోసపోవద్దు: విజయశాంతి

ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో 

Updated : 21 Aug 2022 18:17 IST

హైదరాబాద్‌: ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరిక సందర్బంగా మునుగోడులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు. ‘‘కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో ఏం చేశావ్‌. ఉద్యమం చేస్తానని తెలంగాణలో ప్రవేశించావు. నాకుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు.. నేనొక్కడినే. తెలంగాణకోసం కొట్లాడతానని ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కుటుంబాన్ని తీసుకొచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు.. చేయలేదు. తాను ముఖ్యమంత్రిగా కూర్చుని.. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులను తుంగలోకి తొక్కారు. ఇందుకోసం మిమ్మల్ని సమర్థించాలా? దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. ప్రతి పేద కుటుంబానికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తానన్నారు .. ఇవ్వకుండా మోసం చేశారు. ఇందుకోసం సమర్థించాలా? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే డిజైన్‌ చేశాను, నేనే కడుతున్నానని.. వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. కానీ, ఆడబ్బంతా జేబులో వేసుకున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని ఉద్యమం చేస్తే వారిని కూడా మోసం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారు.. దీనికోసం మిమ్మల్ని సమర్థించాలా? కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.

మోదీ ఆయనకు శత్రువట.. నిజమే. కానీ, మోదీ ప్రజలకు మాత్రం మంచి మిత్రుడు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేదంటున్నారు. ప్రతీ వేదికపై ఇదే చెబుతున్నారు. భయం లేనప్పుడు పదే పదే.. సీబీఐ వస్తే భయంలేదు, ఈడీ వస్తే భయంలేదని ఎందుకు చెబుతున్నారు. లోలోపల మీరు భయపడుతున్నారు కాబట్టే చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పే మాయ మాటలకు ప్రజలు మోస పోయి గెలిపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యా్మ్నాయ పార్టీ లేదు. అందుకే కేసీఆర్‌ను గెలిపించారు... ఆయన చేసిన అవినీతిని భరించారు. కానీ, ఇవాళ భాజపా ప్రత్యామ్నాయంగా వచ్చేసింది. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి మేలు జరిగే విధంగా చేసుకోండి. కేసీఆర్‌ ప్రతి ఎన్నికల్లో  బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకొస్తారు. బీబీసీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. దయచేసి మోసపోవద్దు. నిన్నటి సభకు రూ.వెయ్యి, మద్యం బాటిల్‌  ఇచ్చి జనాలను తరలించారు. రోజు రోజుకీ  కేసీఆర్‌ గ్రాఫ్ పడిపోతోంది. మైండ్‌ గేమ్‌ ఆడుతూ భాజపాలోని నాయకులను విడదీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్ని మైండ్‌గేమ్‌లు ఆడినా భాజపా నేతలను విడదీయలేరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం’’ అని విజయశాంతి స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు