Rahul Gandhi: రాహుల్‌పై వేటు.. ఇది చీకటి రోజు: విపక్షాల ఆగ్రహం

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జైలు శిక్ష పడిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. ఇప్పుడు పార్లమెంట్‌ పదవికి దూరమయ్యారు. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Updated : 24 Mar 2023 19:23 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని పలువురు విపక్ష పార్టీలకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చీకటి రోజు అని, ప్రజాస్వామ్యం మరింత పతనమైందంటూ ట్విటర్‌ వేదికగా మోదీ సర్కారును దుయ్యబడుతున్నారు.

మోదీ దురహంకారానికి పరాకాష్ట.. కేసీఆర్‌

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడంపై భారాస అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటును సైతం తన హేయమైన చర్యల కోసం మోదీ సర్కార్‌ వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నేతలపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం భాజపా ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలి. భాజపా దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

విస్మయం కలిగిస్తోంది: కేజ్రీవాల్‌

రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి అనర్హత వేటు వేయడం విస్మయం కలిగిస్తోందని ఆప్‌ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. యావత్‌ దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

* రాహుల్‌ (Rahul Gandhi)పై అనర్హత వేటు అనేది.. రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించడమే. ఈ అంశంలో చూపిన తొందరపాటు అత్యంత అప్రజాస్వామికం. దీన్ని నేను ఖండిస్తున్నా - భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)

* ‘‘ప్రధాని మోదీ (Modi) నవ భారతంలో.. భాజపా ప్రధాన టార్గెట్‌ ప్రతిపక్ష నేతలే. నేర చరిత్ర కలిగిన భాజపా నేతలకు కేబినెట్‌ పదవులిస్తూ.. ప్రతిపక్ష నేతలను వారి ప్రసంగాల కారణంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నేడు మరింత పతనమవడాన్ని మనం చూస్తున్నాం’’ - పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)

* ‘‘ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. అన్ని సంస్థలు కేంద్రం ఒత్తిడితో పనిచేస్తున్నాయి. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా నేరమైంది. నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం ఆరంభమైంది. ఈ పోరాటానికి ఇప్పుడు ఓ దిశ అవసరం - మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

* ‘‘కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయం రావడం ఆశ్చర్యకరం. పైగా ఆ తీర్పుపై అప్పీల్‌ చేసేందుకు చర్యలు చేపడుతుండగానే ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. నిర్దాక్ష్య రాజకీయాలకు ఇదే నిదర్శనం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ -కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor)

* రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. నియంతృత్వానికి మరో ఉదాహరణ. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా భాజపా ఇదే పద్ధతిని అవలంబించి.. దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాన్ని ఆ పార్టీ మర్చిపోవద్దు. ఈ దేశ ప్రజల కోసం రాహుల్‌ గళమెత్తారు. ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తారు’’ - రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gahlot)

* ‘‘ప్రధానికి సంబంధమున్న అదానీ గ్రూప్‌ మహా మెగా స్కామ్‌పై జేపీసీ వేయడానికి బదులు.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీనిపై మేం మౌనంగా ఉండబోం. మా పోరాటాన్ని న్యాయపరంగా, రాజకీయంగా కొనసాగిస్తాం’’ - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh)

* ‘‘భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. గత 9 ఏళ్లుగా భాజపా ఏ గళానికైతే భయపడుతోందో.. నేడు ఆ గొంతును పార్లమెంట్‌లో అణచివేశారు. ఇది సిగ్గుచేటు. ఇప్పుడు విప్లవం వీధుల్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్నది రాహుల్‌ గాంధీ.. ఆయనను మౌనంగా ఉంచడం కష్టమే కాదు.. అసాధ్యం’’ అని కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని