Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఎన్నికల తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని రాహుల్‌ గాంధీ అన్నారు. భాజపాను ఆయా రాష్ట్రాల్లో తుడిచిపెట్టేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 04 Jun 2023 15:28 IST

న్యూయార్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ భాజపా (BJP) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని భాజపాపై నిప్పులు చెరిగారు.

‘‘భాజపాను తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం’’ అని న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ (Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌, వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్‌ చేరుకోనున్నారు.

కర్ణాటకలో భాజపా (BJP) అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్‌ (Rahul Gandhi) అన్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ ఆ పార్టీని తుడిచిపెట్టేసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ అదే జరగబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో భాజపాను గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ భాజపా (BJP) కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. భాజపా చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే అందుకు కారణమన్నారు. తెలంగాణలో ప్రస్తుతం భారాస అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

2024 ఎన్నికల్లోనూ భాజపా (BJP)ను ఓడిస్తామని రాహుల్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు భాజపా విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని