అందుకే మేం మూల్యం చెల్లించుకున్నాం: నీతీశ్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అక్టోబర్‌ జరిగినన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఆలస్యం చేసినట్లు తెలిపారు. దానికి జేడీయూ........

Published : 10 Jan 2021 14:10 IST

బిహార్‌ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఆలస్యం చేసినట్లు తెలిపారు. దానికి జేడీయూ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. పరోక్షంగా మిత్రపక్ష భాజపా కంటే తక్కువ సీట్లు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. శనివారం జరిగిన జేడీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఎన్నికల కంటే ఐదు నెలల ముందే జరగాల్సిందని నీతీశ్‌ అభిప్రాయపడ్డారు. కానీ, అది జరగకపోవడంతో జేడీయూ మూల్యం చెల్లించుకుందన్నారు. ‘‘నా మీదా.. పార్టీ మీదా.. దుష్ప్రచారం జరుగుతోంది. ఎవరు మిత్రులు.. ఎవరు కాదన్న విషయాన్ని మేం పసిగట్టలేకపోయాం. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాలేదు. వాతావరణం అనుకూలంగా లేదన్న విషయం ఎన్నికలు పూర్తయిన తర్వాతగానీ తెలియలేదు. కానీ, అప్పటికే బాగా ఆలస్యం జరిగిపోయింది’’ అంటూ నీతీశ్‌ పరోక్షంగా భాజపాపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో భాజపా 74 సీట్లలో విజయం సాధించగా.. జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందింది. గతంతో పోలిస్తే జేడీయూ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే, భాజపాతో పొత్తు వల్లే తమకు నష్టం జరిగిందని జేడీయూ వర్గాల్లో రుసరుసలు వినిపించాయి. చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ జేడీయూ ఓట్లను చీల్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. ఎల్జేపీ.. భాజపా మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని.. అదే తమని దెబ్బకొట్టిందని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీయూ.. భాజపా మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నీతీశ్‌ వ్యాఖ్యలతో వాటికి మరింత బలం చేకూరినట్లయింది.

ఇవీ చదవండి..

యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది భాజపా ప్రభుత్వమే

జగన్‌ కేసుల్లోని అధికారులకు ఉన్నత పదవులా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని