
కౌన్ బనేగా బెంగాల్ టైగర్?
రాబోయే ఎన్నికల్లో కాబోయే బెంగాల్ టైగర్ ఎవరు? జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరి చర్చా అదే. అందుకు తగ్గట్టే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందునుంచే అక్కడి రాజకీయం వేడెక్కింది. హ్యాట్రిక్ కొట్టాలని దీదీ.. ఎట్టిపరిస్థితుల్లో బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఢీ అంటే ఢీ అంటున్నారు. బెంగాల్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరే గుర్తుకొచ్చేది. తరువాత కాంగ్రెస్ స్థానంలోకి తృణమూల్ వచ్చి చేరడంతో అది కాస్త వామపక్షాలు, దీదీ పోరాటంగా మారింది. క్రమంగా కాంగ్రెస్, కామ్రేడ్లు బలహీనపడగా ఇప్పుడు కమలనాథులు పోటీలోకి వచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో నిలిచేదెవరు? గెలిచేదెవరు? పశ్చిమబెంగాల్ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఈ నెల 27 నుంచి సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా, కొంత కాలంగా బెంగాల్ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు అందరిచూపూ అటువైపే. అక్కడ ఎవరు పాగా వేస్తారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది.
దీదీ హ్యాట్రిక్ కొడతారా?
మూడు దశాబ్దాలపాటు అప్రతిహతంగా సాగిన వామపక్షాల పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ 2011లో అధికార పగ్గాలు చేపట్టడం ఒక చరిత్ర. 2016లోనూ అక్కడి ప్రజలు మరోసారి దీదీకే అధికారం కట్టబెట్టారు. అదీ ఓ చరిత్రే. కానీ ఈసారి మాత్రం ఆమె హవా కొనసాగించడం నల్లేరుమీద నడకలా లేదు. ఒకవైపు పాత శత్రువులు కామ్రేడ్లు. వారికి జతగా కురువృద్ధ కాంగ్రెస్. మరొకవైపు కొత్తగా బద్ధశత్రువులగా మారిన కమలనాథులు. గత లోక్సభ ఎన్నికల నుంచే భాజపా, తృణమూల్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఏ అవకాశం దొరికినా ఇరుపార్టీల కార్యకర్తలు దాడులకు దిగుతూ రాష్ట్రానికి రణరంగా మార్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వేడి మరింత పెరిగిపోయింది. 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీ బరిలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపాతో పాటు ఇటీవల ఏకమైన కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి మధ్య పోటీలో దీదీ హ్యాట్రిక్ కొడతారా? లేదా? అనే అంశం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
ఉత్సాహంతో దూసుకెళ్తున్న కమలనాథులు
పశ్చిమబెంగాల్లో ఒక్కసారి కూడా అధికారం సొంతం చేసుకోని భాజపా గత లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా పుంజుకొంది. 2019 సాధారణ ఎన్నికల్లో అక్కడి 42 లోక్సభ స్థానాలకు గానూ 18 చోట్ల విజయం సాధించింది. నాటి నుంచి అదే దూకుడుతో ప్రతి విషయంలో దీదీని ఢీ కొడుతున్నారు. ఆ ఎన్నికల్లో ఓట్ల శాతం బాగా పెంచుకోవడం భాజపా శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది. 2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమై 10.16శాతం ఓట్లు సాధించిన భాజపా.. 2019 ఎన్నికలు వచ్చేసరికి అది 40.64శాతానికి పెరగడం కాషాయ దళంలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది. అదే ఊపులో ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మోదీ, అమిత్ షా నాయకత్వంలో భాజపా ముందుకెళ్తోంది. బెంగాల్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామని భారీ హామీలతో బెంగాలీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
భాజపా గూటికి టీఎంసీ కీలక నేతలు
తృణమూల్లో బలమైన నేతగా ఉన్న సువేందు అధికారి వంటి నేతలు భాజపా గూటికి చేరారు. అదేబాటలో ఆపరేషన్ ఆకర్ష్తో తృణమూల్ నుంచి కాషాయ కండువా కప్పుకొన్న 18 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఒక ఎంపీ తృణమూల్ నుంచి భాజపాలో చేరారు. వలసలకు తోడు అవకాశం చిక్కినప్పుడల్లా భాజపా అగ్రనేతల అమిత్ షా, జేపీ నడ్డా, తదితరులు పలుమార్లు బెంగాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. బెంగాలీలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. భాజపాను దీటుగా ఎదుర్కొనేందుకు అదే స్థాయిలో అన్ని అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు మమతా బెనర్జీ. బెంగాలీల ఆత్మగౌరవం మొదలుకొని.. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ సేవలు.. ఇలా అన్ని విధాలా సన్నద్ధమవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టేందుకు భాజపాను రాష్ట్రం బయటే ఆపాలంటూ ఓటర్లకు పిలుపునిస్తున్నారు. భాజపా మత, విచ్ఛిన్నకర ఓటుబ్యాంకు రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. తన వారసుడిగా అభిషేక్ బెనర్జీని నేరుగానే ముందుపెట్టి తృణమూల్ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
గట్టిదెబ్బ రుచి చూపిస్తామంటోన్న కాంగ్రెస్
గత ఐదేళ్లలో అక్కడ భాజపా పుంజుకున్నా.. తృణమూల్ ఓటు బ్యాంకు చెక్కుచెదరకపోవడం దీదీకి ఎంతో ఊరటనిచ్చే విషయం. పార్టీ నుంచి భాజపాలోకి ప్రవాహంలా సాగుతున్న వలసలే ఆమెకు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. ఒకవేళ బెంగాల్లో భాజపా గెలిస్తే వారి ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుంది. కానీ తృణమూల్ ఓడిపోతే జాతీయ స్థాయిలో విపక్ష కూటమి గళమే చిన్నబోతుంది అన్న విశ్లేషకుల అంచనాలు ఆమెపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక వామపక్షాలతో కలిసే ఎన్నికల్లోకి వెళ్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో తృణమూల్, భాజపాకు గట్టి దెబ్బరుచి చూపుతామంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, భాజపా కూటమి 76 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ రెండు సీట్లలో విజయంతో 5.6శాతం ఓట్లు సాధించింది. వామపక్షాలు ఒక్కసీటైనా సాధించలేక చతికిలపడ్డాయి. ఆ గతాన్ని బట్టి రాజకీయ నిపుణుల అంచనాల ప్రకారం కాంగ్రెస్ -లెఫ్ట్ కూటమి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ.. తమ ఓట్లను భాజపా ఖాతాలో పడకుండా అడ్డుకట్ట వేయడంపై దృష్టిపెడుతున్నాయి.
ఒవైసీ ప్రయత్నంతో మేలెవరికి?
ఈ హోరాహోరీలో తృణమూల్ భాజపా మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల యుద్ధం తారస్థాయికి చేరాయి. ఫిరాయింపులు, నేతలపై దాడులు, జైశ్రీరాం నినాదాలతో ప్రచారం వేడెక్కింది. ఎంఐఎం నుంచి పలువురు నేతలు తృణమూల్లోకి చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్, బిహార్ ఎన్నికల్లో జోరు చూపించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు బెంగాల్పై కన్నేశారు. అక్కడ 30శాతానికి పైగా జనాభాతో వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తులుగా ఉన్న ముస్లింలను తమ వైపు ఏకం చేసే పనిలో పడ్డారు. అయితే, ఆయన ప్రయత్నం చివరకు ఎటుతిరిగి ఎవరికి ప్రయోజనం అనే విషయంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోణంలో చూస్తే బెంగాల్ను మూడు దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం ప్రభుత్వాన్ని గద్దెదించి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడంలో ముస్లింలది కీలకపాత్ర. 30శాతానికి పైగా జనాభాతో 35శాతం అసెంబ్లీ స్థానాలను వారు ప్రభావితం చేస్తారు. భాజపాను ఎదుర్కొనేది మమత మాత్రమేనని అభిప్రాయం మైనార్టీల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మమత పాలనపై అసంతృప్తిగా ఉన్నా.. భాజపా కన్నా మమతే మేలని భావిస్తే వారి ఓట్లూ తృణమూల్కే పడొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా, మమత మైనార్టీల పట్ల సానుకూల విధానాలు అవలంబిస్తారనే పేరు కూడా ఉంది. ఈ తరుణంలో ప్రతిష్ఠాత్మకంగా బెంగాల్ పీఠం ఎవరికి దక్కనుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
10th Results: తెలంగాణలో ఈనెల 30న పదో తరగతి ఫలితాలు
-
Politics News
Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభం వేళ.. కార్యాచరణ సిద్ధం చేస్తోన్న భాజపా
-
Crime News
Crime News: పంజాగుట్టలో దారుణం... భార్యను హతమార్చి, రైలుకింద పడి భర్త ఆత్మహత్య
-
Politics News
Maharashtra crisis: ముంబయికి రండి.. కూర్చొని మాట్లాడుకుందాం: రెబల్స్కు ఉద్ధవ్ విజ్ఞప్తి
-
Crime News
Crime News: పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఒకరు, తక్కువ మార్కులు వచ్చాయని మరొకరి బలవన్మరణం
-
Business News
Stock Market: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
- ఔరా... అనేల